శామీర్ పేటలో రెండిళ్లలో డబ్బులు, బంగారం చోరీ

శామీర్ పేటలో రెండిళ్లలో డబ్బులు, బంగారం చోరీ

శామీర్ పేట, వెలుగు:  రెండిళ్లలో దొంగలు పడి నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరులో జహంగీర్ బాబు, కలమ్మ దంపతులు బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది.

ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు కిందపడి ఉండి.. రూ.1.75 లక్షల నగదు, 9 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. పక్కనే మరో ఇంట్లో కూడా వెండి ఆభరణాలు, రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.