
సూర్య సేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలంలో ప్రజలు చాలా ఇబ్బందిపడసాగారు. అతని పాలనపై ప్రజలు విసుగుచెంది మంత్రికి ఫిర్యాదు చేశారు. కొత్త రాజును ఎన్నుకునే సమయం తప్పక వస్తుందని హామీ ఇచ్చాడు మంత్రి.ఒకరోజు పండితుడు రాజుగారితో చర్చిస్తున్న సమయాన పాటల గురించి చర్చ వచ్చింది. మహారాజా, కొన్ని పాటలు వింటే రాతి గుండెలు కూడా కరిగిపోతాయని గ్రంథాల్లో చెప్పారు అన్నాడు.
సూర్యసేనుడికి కోపమొచ్చింది
పేరుకు పండితులే కానీ.. బుర్ర అనేది ఏమాత్రం లేదు. పాటలకు సంతోషం దుఃఖం కలుగుతుందని చెప్పినా నమ్మేవాడిని... గుండె కరుగుతుందని చెబుతున్నారు. మీ మాటలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. కోపం కూడా తెప్పిస్తున్నాయి. ఈయనను చెరసాలలో బంధించండి. ఈ రాజ్యంలో ఎవరైనా తమ పాటతో శారీరకంగా నాలో మార్పు తెప్పించగలిగిన రోజు ఈ పండితుడిని చెరసాల నుండి విడుదల చేస్తాను అంటూ గట్టిగా అరిచి చెప్పాడు సూర్యసేనుడు.ఇదే విషయం రాజ్యమంతటా దండోరా వేయించాడు మంత్రి.
పాపమ్మ తన మనవడిని సముదాయించసాగింది.అవ్వా! నేను ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్లి మూగవాడిగా బ్రతుకుతాను...అంటూ గాడిదలా అరిచిన తరువాత...అందరూ గాడిద గోపన్నా అని పిలుస్తూ యెగతాళి చేస్తున్నారు... అంటూ చివరగా గాడిదలా అరుస్తూ బాధపడ్డాడు. పాపమ్మ మనవడిని సముదాయించసాగింది.
గోపన్నా, నీవు పుట్టినప్పుడు వచ్చిన జ్వరం తగ్గడం కోసం మూలికల కషాయం ఇచ్చాము. జ్వరం తగ్గడంతో పాటు నీ గొంతు కూడా గాడిద గొంతులా తయారయింది. కొన్ని మాటలు మాట్లాడితే నీ గొంతు గాడిదలా అరుస్తుంది. అందుకే నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా సైగ చేస్తూ తన దుస్తుల సంచి ఎత్తుకున్నాడు.
గోపన్నా, నీవు మంచి ధనవంతుడవు అయ్యావంటే, అప్పుడు ఇలా యెగతాళి చెయ్యడానికి బదులు గౌరవిస్తారు. నా మాట విను. కొంతకాలం ఓపిక పట్టు పాపమ్మ ఈ మాట చెబుతుండగా రాజుగారి దండోరా వినిపించింది. ఒరే గోపన్నా, నీకు మంచి రోజులు వచ్చాయిరా అంటూ గోపన్నను రాజుగారి ముందు పాడమని సలహా ఇచ్చింది. రాగాలు, స్వరాలు తెలీకపోయినా పాపమ్మ మామూలు పాటలు నేర్పించింది.రాజుగారి ముందు నిలబడి గోపన్న పాడటం ప్రారంభించాడు. ప్రతి వాక్యం చివర గాడిద గొంతుతో అరవసాగాడు. పాడకుండా ఎందుకు సైగ చేస్తున్నావు అన్నాడు సూర్యసేనుడు.
కళ్ళు మూసుకొని పాడుతున్న గోపన్న ఆ మాటలు వినలేదు. మంత్రి జరిగినది అర్థం చేసుకొని ఒక తాళపత్రంలో మహారాజా, అతని పాటలకు మీ రెండు చెవులలో కర్ణభేరి కరిగిపోవడంతో మీకు చెవుడు వచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలీదు అని వ్రాసి ఇచ్చాడు.తనకు చెవుడు వచ్చిందని గ్రహించి బయటకు చెప్పకుండా గోపన్న భుజం తట్టి నా గుండెను కరిగించావు అంటూ తన భవనంలోనికి వెళ్ళాడు..
సూర్యసేనుడు రాజు పదవినుండి వైదొలగి కొత్త రాజును ఎన్నుకోమని చెప్పినట్లు మంత్రి ప్రకటించాడు.గోపన్నకు రాజభవనంలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరూ గోపన్నాగారూ అని మర్యాదగా పిలవడం ప్రారంభించారు. ఆస్థాన వైద్యులు గోపన్నకు గాడిద గొంతు పోవడానికి వైద్యం ప్రారంభించారు.
–వెలుగు,లైఫ్–