రికవరీల్లో హయ్యెస్ట్.. మరణాల్లో హయ్యెస్ట్

రికవరీల్లో హయ్యెస్ట్.. మరణాల్లో హయ్యెస్ట్
  • ఒక్కరోజే 4 లక్షల రికవరీలు
  • దేశంలో ఇదే ఫస్ట్​ టైం
  • కొత్తగా 2.63 లక్షల కేసులు.. 4,329 మంది మృతి
  • ఒక్కరోజు మరణాల్లో హయ్యెస్ట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారితో ఓ హోప్​ కనిపిస్తోంది. దేశంలో తొలిసారిగా సోమవారం ఒక్కరోజే 4,22,436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటు కేసులూ వరుసగా రెండో రోజూ 3 లక్షలలోపే నమోదయ్యాయి. అయితే, రికార్డ్​ స్థాయిలో 4,329 మంది మరణించారు. కొత్తగా 2,63,533 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య రెండున్నర కోట్లు దాటింది. ఇప్పటిదాకా 2 కోట్ల 52 లక్షల 28 వేల 996 మందికి కరోనా సోకింది. 2,78,719 మందిని బలితీసుకుంది. మహమ్మారి బారిన పడినోళ్లలో 2 కోట్ల 15 లక్షల 96 వేల 512 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 33 లక్షల 53 వేల 765 మంది ఇంట్లో లేదా ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. కొత్త కేసుల్లో 69 శాతం 8 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. సోమవారం దేశవ్యాప్తంగా 15 లక్షల 10 వేల 418 టీకా డోసులను జనానికి వేయగా.. 18 లక్షల 69 వేల 223 మందికి టెస్టులు చేశారు. దీంతో ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల సంఖ్య 18,44,53,149కి పెరగ్గా.. మొత్తం టెస్టుల సంఖ్య 31,82,92,881కి చేరింది. లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఢిల్లీలో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. 4,482 మందికి పాజిటివ్​ రాగా.. 265 మంది చనిపోయారు. ఇక, సోమవారం ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యి మంది మరణించారు.