పిల్లలను వాగులో తోసేసిన తల్లి

పిల్లలను వాగులో తోసేసిన తల్లి

కామారెడ్డి/బాన్స్​వాడ, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్స్​వాడలోని వాగులో పడి సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోగా, తల్లే పిల్లలను తోసేసి చంపినట్లు తేలింది. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, వాగులో నీళ్లు తక్కువగా ఉండడంతో కుదరలేదు. బాన్స్ వాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా గొల్లగుట్ట తండాకు చెందిన అరుణకు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా మల్లాపూర్​కు చెందిన జాదవ్​మోహన్​తో పెండ్లి కాగా, వీరికి కొడుకు యువరాజ్(4), కూతురు అనన్య(6 నెలలు) ఉన్నారు. భార్యాభర్తల గొడవల నేపథ్యంలో అరుణ కొద్దిరోజులుగా పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటోంది.

సోమవారం సాయంత్రం అత్త గారింటికి వెళ్లేందుకు గొల్లగుట్ట తండా నుంచి పిల్లలతో బాన్స్ వాడకు వచ్చిన అరుణ.. పిల్లలను చంపి, తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. బాన్స్ వాడ శివారులోని పెద్దపూలు వాగులో పిల్లలు ఇద్దరిని తోసేసింది. తర్వాత తాను కూడా దూకింది. లోతు తక్కువగా ఉండడంతో అరుణ మునగలేదు. అటుగా వెళ్తున్న వారు గమనించి పిల్లలను బయటికి తీయగా అప్పటికే చనిపోయారు. పోలీసులు, స్థానికులు అరుణను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆటోలో వస్తుండగా డ్రైవర్ తన ఇద్దరు పిల్లలను వాగులో పడేశాడని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా అరుణ పిల్లలతో కలిసి గొల్లగుట్ట తండా నుంచి బస్సులో వచ్చినట్లు తేలింది. చివరికి తానే పిల్లలను తోసేశానని, తాను కూడా నీటిలో దూకానని ఒప్పుకుంది. భర్త మోహన్ ఫిర్యాదుతో అరుణను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.