టీలో విషం కలిపింది: తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు

టీలో విషం కలిపింది: తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు

నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు
కర్నూలు జిల్లా డోన్ లో ఘటన

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ తారకరామనగర్ లో నలుగురు పిల్లలతో వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. విషం కలిపిన టీని తాను తాగి.. పిల్లలకు బలవంతంగా తాగించింది. పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. డోన్ లో ప్రాథమిక చికిత్స తర్వాత  కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే వరలక్ష్మి చనిపోయింది. చిన్నారులు ఇందు(12), ఉమాదేవి(10), ఉదయ్(5), ఐశ్వర్య (2) కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు.

తారకరామనగర్ లో ఉంటున్న ఈరన్న, వరలక్ష్మి దంపతులకు నలుగురు పిల్లలు. పెద్దకూతురు ఇందు 8వ తరగతి, రెండో అమ్మాయి ఉమాదేవి నాలుగో తరగతి, కొడుకు ఉదయ్ ఒకటో తరగతి చదువుతున్నారు. రెండేళ్ల ఐశ్వర్య తల్లి వద్దే ఉంటోంది. చిరు వ్యాపారి అయిన ఈరన్న, పూలమ్మే వరలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవపడేవారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి భర్త చేయి చేసుకోవడం,  సోమవారం ఉదయం కూడా గొడవపడటంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.