బాచుపల్లిలో ఇద్దరు పిల్లలతో సంపులో దూకిన తల్లి..చిన్నారులు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ తల్లి

బాచుపల్లిలో ఇద్దరు పిల్లలతో సంపులో దూకిన తల్లి..చిన్నారులు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ తల్లి
  • ఫ్యామిలీ ప్లానింగ్​ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవే కారణం
  • బాచుపల్లిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్​విషయంలో మొదలైన గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. భర్తతో గొడవ పెట్టుకున్న భార్య.. ఇద్దరు కొడుకులను సంపులో పడేసి.. తానుకూడా అదే సంపులో దూకింది. అయితే, చిన్నారులు మృతిచెందగా.. తల్లి ప్రాణాలతో బయటపడింది. మేడ్చల్​ జిల్లా బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం విలేజ్​కు చెందిన లక్ష్మణ్, రత్న దంపతులకు జనార్దన్(8), పవన్(7), అరుణ్​(3), సుభాష్(8 నెలలు) నలుగురు మగ సంతానం. 

బతుకుదెరువు కోసం వచ్చి నిజాంపేట్​హనుమాన్​ టెంపుల్ ఏరియాలో​నివాసముంటున్నారు. అందులో ఇద్దరు పిల్లలు జనార్దన్, పవన్​వారి నానమ్మ వద్ద ధర్మారం విలేజీలో ఉంటున్నారు. లక్ష్మణ్, రత్న తమ చిన్న కొడుకులు అరుణ్, సుభాష్ తో కలిసి బాచుపల్లిలో ఓ రేకుల గదిలో ఉంటున్నారు. లక్ష్మణ్​ ఇటుక లారీలపై కూలీగా పనిచేస్తుంటాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్​విషయంలో గొడవ జరుగుతోంది. 

తనకు మరో సంతానంగా ఆడపిల్ల కావాలని లక్ష్మణ్​ పట్టుపడుతున్నాడు. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారని.. తనకు ఫ్యామిలీ ప్లానింగ్​ చేయించాలని భార్య రత్న కోరుతోంది. ఇందుకు భర్త అంగీకరించలేదు. మంగళవారం సైతం అదే విషయమై గొడవ జరిగింది. రాత్రి లక్ష్మణ్​ పనికి వెళ్లగా రత్న తన ఇద్దరు పిల్లలు అరుణ్, సుభాష్ ను ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసి ఆమె కూడా దూకింది.

 శబ్దం రావడంతో పక్కనుండే ఓ వ్యక్తి గమనించి సంపులో ఉన్న రత్నను పైకి లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పిల్లలను బయటకు తీయగా అప్పటికే వారు మృతిచెందారు. రత్నను ట్రీట్​మెంట్​కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.