
- ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవే కారణం
- బాచుపల్లిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్విషయంలో మొదలైన గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. భర్తతో గొడవ పెట్టుకున్న భార్య.. ఇద్దరు కొడుకులను సంపులో పడేసి.. తానుకూడా అదే సంపులో దూకింది. అయితే, చిన్నారులు మృతిచెందగా.. తల్లి ప్రాణాలతో బయటపడింది. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం విలేజ్కు చెందిన లక్ష్మణ్, రత్న దంపతులకు జనార్దన్(8), పవన్(7), అరుణ్(3), సుభాష్(8 నెలలు) నలుగురు మగ సంతానం.
బతుకుదెరువు కోసం వచ్చి నిజాంపేట్హనుమాన్ టెంపుల్ ఏరియాలోనివాసముంటున్నారు. అందులో ఇద్దరు పిల్లలు జనార్దన్, పవన్వారి నానమ్మ వద్ద ధర్మారం విలేజీలో ఉంటున్నారు. లక్ష్మణ్, రత్న తమ చిన్న కొడుకులు అరుణ్, సుభాష్ తో కలిసి బాచుపల్లిలో ఓ రేకుల గదిలో ఉంటున్నారు. లక్ష్మణ్ ఇటుక లారీలపై కూలీగా పనిచేస్తుంటాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్విషయంలో గొడవ జరుగుతోంది.
తనకు మరో సంతానంగా ఆడపిల్ల కావాలని లక్ష్మణ్ పట్టుపడుతున్నాడు. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారని.. తనకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలని భార్య రత్న కోరుతోంది. ఇందుకు భర్త అంగీకరించలేదు. మంగళవారం సైతం అదే విషయమై గొడవ జరిగింది. రాత్రి లక్ష్మణ్ పనికి వెళ్లగా రత్న తన ఇద్దరు పిల్లలు అరుణ్, సుభాష్ ను ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసి ఆమె కూడా దూకింది.
శబ్దం రావడంతో పక్కనుండే ఓ వ్యక్తి గమనించి సంపులో ఉన్న రత్నను పైకి లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పిల్లలను బయటకు తీయగా అప్పటికే వారు మృతిచెందారు. రత్నను ట్రీట్మెంట్కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.