- ఆరేండ్ల కొడుకు పైకి కారెక్కించి చంపింది
- డెడ్బాడీని తీసుకెళ్లి నదిలో పడేసింది
- అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఓ తల్లి దారుణం
న్యూఢిల్లీ: ఆరేండ్ల చిన్నారిపై ఓ తల్లి కారు ఎక్కించి చంపేసింది. డెడ్బాడీని కారులో తీసుకెళ్లి నదిలో పారేసింది. ఆ తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్లి తన కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఈ దారుణమైన సంఘటన జరిగింది.
పార్క్కు తీసుకెళ్లి..
ప్రిబెల్ కౌంటీలోని రష్ రన్ పార్క్కు తన ముగ్గురు పిల్లలను శుక్రవారం బ్రిట్టనీ గొస్నేయ్ కారులో తీసుకెళ్లింది. తన ఆరేండ్ల కొడుకు జేమ్స్ హచిన్సన్ను బోట్ ర్యాంప్ దగ్గరకు తీసుకెళ్లి అక్కడే తనను వదిలిపెట్టి రావాలని ప్రయత్నించింది. పిల్లాడు ఆడుకుంటుండగా వచ్చి కారెక్కింది. తల్లి కారెక్కడం చూసిన జేమ్స్.. పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో గోస్నేయ్ కారును ఆ పిల్లాడి మీది నుంచి పోనిచ్చింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అరగంట తర్వాత వెళ్లి చూస్తే పిల్లాడు చనిపోయాడు. డెడ్బాడీని తీసుకొని కారులో వేసుకుంది. ఇంటికెళ్లింది. తర్వాత రోజు రాత్రి డెడ్బాడీని తీసుకెళ్లి ఒహాయో నదిలో విసిరేసింది.
పిల్లాడిని చంపినా పశ్చాత్తాపం లేదు
పిల్లాడిని చంపేసి, ఏమీ తెలియనట్టు ఆదివారం పొద్దున గొస్నేయ్, తన బాయ్ఫ్రెండ్ జేమ్స్ హామిల్టన్తో కలిసి మిడిల్టౌన్లోని ఓ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన కొడుకు కనబడట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు సెర్చ్ స్టార్ట్ చేశారు. అయితే, గోస్నేయ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పిల్లాడిని తానే హత్యచేసినట్లు ఒప్పుకుంది.