కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి పట్టిన శని

కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి పట్టిన శని

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. శ‌నివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారు విఫలమైంద‌ని అన్నారు. సన్న రకం వ‌డ్లు సాగు చేయమని మంచి ధర ఇప్పిస్తానని చెప్పిన సీఎం మాట తప్పారన్నారు. దుబ్బాక ఎన్నికల కోసం మక్కలకు రూ.100-150 ఎక్కువిస్తామని అబద్దాలు చెప్పాడ‌న్నారు.కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి పట్టిన శని.. అని, సీఎం తీరుతో రైతులకు ప్రభుత్వాలపై నమ్మకం పోతుందని అన్నారు. పౌల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులను, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైస్ మిల్లర్ల వద్ద కేసీఆర్ ఫ్యామిలీ లంచాలు తీసుకుంటున్నారని అర‌వింద్ అన్నారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అతలాకుతలం అయిందని.. కొత్త రాష్ట్రంలో ఒక్క కొలువు కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలు నాశనం అయ్యాయని అన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ‌ కేంద్రం ఇచ్చినా, టీఆరెస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింద‌ని.., విద్యుత్ బకాయిలు ఎగ గొట్టేందుకు విద్యుత్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం నోటికొచ్చింది మాట్లాడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఎంపీ అన్నారు.