హనుమకొండ: కొడుకు కోసం ఈటలను కేసీఆర్ బయటకు పంపాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేటీఆర్ చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అన్నారు. రాజేందర్ను ఇబ్బంది పెట్టే బదులు కొడుకుకు బుద్ధి చెబితే బాగుంటుందని అర్వింద్ సూచించారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఈటలతో కలిసి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్వింద్ పై వ్యాఖ్యలు చేశారు.
‘అప్పట్లో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు మేమందరం ఈటలను చేయాలన్నాం. ఆనాటి నుంచి కేసీఆర్కు నిద్రపట్టలేదు. టీఆర్ఎస్ పునాదుల దగ్గర నుంచి ఈటల ఉన్నాడు. ఆ పార్టీలో బలమైన భాగం ఈటల. కొడుకు కోసం ఈటలను బయటకు పంపాడు. చేతగాని కొడుకు.. ఆయనో చేతగాని దద్దమ్మ. తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టినట్లు కేసీఆర్ నామీద కూడా పెడతాడు కావచ్చు. కొడుకు చేతగానివాడు కావడం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. రాజేందర్ను ఇబ్బంది పెట్టే బదులు కొడుకుకు బుద్ధి చెబితే బాగుంటుంది. ప్రతిసారి దుబాయ్కు పోవుడు వచ్చుడేనా... అని కేటీఆర్ను కేసీఆర్ తిట్టాడు. ఆ ముసలాయనకి సోయి ఎప్పుడు వస్తుందో ఏమో.. ఈటలతో గెలుక్కున్నకాన్నుంచి ఆయనకు నిద్ర పట్టడం లేదు. మితిమీరిన అహంకారం వల్లే ఇలాంటి పరిస్థితి. పేదప్రజల రక్తమాంసాలు తిని సంపాదించిన అహంకారం కేసీఆర్ది. ఓటమి ఎరుగని ఈటల ఎదుగుతున్నాడని జీర్ణించుకోలేక బయటకు పంపాడు. కేసీఆర్ను మించిన అవినీతి గబ్బిలాలు కేటీఆర్, హరీశ్. వారి తప్పులు కప్పిపుచ్చడానికే దళితబంధు తెచ్చాడు. ప్రజలు మరిచిపోయినా.. నీ మోసాలు ప్రజలకు మేం గుర్తు చేస్తాం. దళితబంధు ఆపింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎన్జీవోలతో ఫిర్యాదు చేయించి.. ఏదో చేసి దళితబంధు ఆపించిండు. అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అయ్యాయంటే.. ఖజానాలో నిధులు లేవని అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎనౌన్స్ చేసావ్ ? ఓడిపోయే దగ్గరకు కేటీఆర్ రాడు. వాళ్ల బావను దుబ్బాకలో తన్నినట్లు... ఇక్కడ కూడా ప్రజలు తంతారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటని టీఆర్ఎస్ వాళ్లంటుంటే... టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ వాళ్లంటున్నారు. అలా అయితే ఏసీబీ కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు బయట ఉన్నాడు. లొట్టపీసు కేసులో మల్లన్న లోపలెందుకున్నాడు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, కేటీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసి ఆపరేషన్ హైద్రావతి మొదలుపెట్టారు. అందులో భాగంగానే టీడీపోడు.. కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యాడు. కేటీఆర్ ప్రతిసారి పార్టీలను బలోపేతం చేసుకోవడానికి తమిళనాడు పోతున్నాడు. ఈ సన్నాసికి పార్టీ పెట్టాక 21 ఏళ్లకు బలోపేతం చేసుకోవాలని గుర్తుకొచ్చింది. టీఆర్ఎస్లో 80 శాతం, జగన్ పార్టీలో 100 శాతం వలసదారులే. రాష్ట్రంలో కాంగ్రెస్ను, టీఆర్ఎస్ను పోషించేది పంగనామాల పెద్దమనిషి చంద్రబాబే. అక్కడ లోకేష్, ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రులవుతారట. హుజురాబాద్లో నీ కొడుకును పోటి చేయిస్తే అయిపోతుండే. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అన్నారు.. ఇచ్చారా? నేను సర్వే చేయిస్తే.. ఈటల రాజేందర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని తేలింది. గుండెల్లో ఉన్నోడిని డబ్బులతో కొనగలరా?’ అని అర్వింద్ ప్రశ్నించారు.
For More News..