కేసీఆర్ దళిత సమాజాన్ని మోసం చేశాడు

కేసీఆర్ దళిత సమాజాన్ని మోసం చేశాడు

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ నేతలు విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ విగ్రహానికి పూల మాలలు వేసి బీజేపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ జయంతుల సందర్భంగా వారిని కేసీఆర్ ఎందుకు స్మరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎదిగిన మనిషి.. బాబు జగజ్జీవన్ రాం అని బండి సంజయ్ అన్నారు.  అంబేద్కర్‌పై గౌరవం ఉంటే హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తానన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఈ నెల 14వ తారీఖైనా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. జగ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. దేశంలో దళిత సమాజానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.