కేసీఆర్ ఫాంహౌజ్‎లో గంజాయి గిట్ల పండిస్తున్నడేమో

కేసీఆర్ ఫాంహౌజ్‎లో గంజాయి గిట్ల పండిస్తున్నడేమో

వికారాబాద్: ‘రైతులు పంటగిట్టుబాటకాక నష్టపోతుంటే.. కేసీఆర్ ఏమో ఎకరానికి కోటి సంపాదిస్తున్నడట. గంజాయి గిట్ల పండిస్తున్నడేమో’ అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయన తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు వికారాబాద్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

‘మీ ఆశీర్వాదంతో రైతు, పేదల ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. 2023లో మీ ఆశీస్సులతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తం. ఈ రోజు డబుల్ బెడ్రూం, రుణమాఫీ, ఫ్రీ యూరియా అని కేసీఆర్ కోతలు కోస్తున్నడు. ఒక్కటి కూడా అమలు  చేయలేదు. 
సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి.. మిగిలిన అన్ని సబ్సిడీలు బంద్ చేసిండు. అద్బుతాలు సృష్టిస్తానన్నాడు. కానీ స్ప్రింకర్ల సబ్సిడీ, పాలీహౌజ్ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ బంద్ చేసిండు. చివరకు రుణమాఫీ చేస్తనన్నడు. బ్యాంకులో వేసుకున్న సొమ్మును కూడా బ్యాంకు వాళ్లు లాక్కుంటున్నారు. రైతులు హరిగోస పడుతున్నారు. కేసీఆర్‎కు వందలాది ఎకరాల ఫాంహౌజ్ ఉంది. ఆయన ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. మరి ఏం పండిస్తుండో.. గంజాయి గిట్ట పండిస్తున్నడేమో. ఆయన ఫాంహౌజ్‎లో సాయిల్ టెస్ట్ చేసుకుంటడు. దొడ్డు వడ్లు పండిస్తడు. కానీ రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలని చెప్తడు. పండించిన పంటను మీ బావుల దగ్గరే కొని మీ ఇంటికే డబ్బులు పంపిస్తామని చెప్పిన కేసీఆర్ అవేమీ చేయలేదు. రైతులు ధాన్యం అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు పడి నానా గోస పడుతున్నరు. 

రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెచ్చింది. కౌలు రైతు సహా ప్రతి రైతు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్త్తోంది. మరి కేసీఆర్ కౌలు రైతులకు ఎందుకు రైతుబంధును అమలు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 244 కోట్ల రూపాయల నిధులిచ్చింది. విత్తనాల కోసం రూ. 4 కోట్లు, క్రిషి సంచాయి యోజన కింద మరికొన్ని కోట్లు ఇచ్చింది. రైతే రాజు అని మనం అంటుంటాం. కానీ, రైతు బికారిగా మారిండు. తన కొడుకును రైతుగా చేయడానికి ఏ రైతు ఇష్టపడటం లేదు. ఇట్లయితే దేశానికి అన్నం పెట్టేవాళ్లెవరు? పంట నష్టం వస్తే వివరాలు తీసుకెళుతున్నారే తప్ప సాయం మాత్రం చేయడం లేదు. ధరణి పెద్ద స్కాం. ఎవరి పట్టా, ఎవరి స్థలం, ఎవరి పేరు మీద ఉందో అంతా గందరగోళం. ఓ పెద్దాయన ప్రాణహిత చేవెళ్ల డిజైన్ పేరిట కాల్వలు తవ్వి డబ్బులు దొబ్బుకుపోయిండు. ఈయన వచ్చి రీ డిజైన్ పేరు మీద అంచనాలు పెంచి కోట్లు దండుకున్నడు. ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం రాలేదు. అందరూ కలిసి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిండ్రు’ అని బండి సంజయ్ అన్నారు.