హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీని స్వాగతిస్తున్నానని కానీ సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అని విమర్శిస్తే జనం నమ్మరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల్లో ఆమెకు మార్కులు పడాలంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీలో ఆమె భాగస్వామ్యం ఎంత అనేది నిజాయితీగా ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించారు.
తెలంగాణలో ప్రజా పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని, మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని, అలాంటి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి కవిత తన స్థాయిని దిగజార్చుకోవద్దని కోరారు. రేవంత్ ను కర్కోటకుడు వంటి పదాలతో కవిత విమర్శిస్తే జనంలో ఆమె చులకనవుతారన్నారు. కవిత ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తే తెలంగాణలో ఆమె పార్టీకి ఎంతో కొంత ఆదరణ ఉంటుందని ఎంపీ సూచించారు.

