ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడించే బాధ్యత తమదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన వ్యాపార వేత్త పైడి రాకేశ్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి మంగళవారం ఆర్మూర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ లోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ అర్వింద్, రాకేశ్ రెడ్డి పూలమాల వేశారు. అనంతరం రోడ్ షోలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ కొడుకు ఆదేశాలతో ఆర్టీసీ మాల్ఓనర్ తనపై, తన ఇంటిపై దాడి చేశాడని ఆరోపించారు. ఆయన్ను 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడించి ఆర్మూర్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మోదీ ప్రభంజనాన్ని ఒక ఆర్టీసీ మాల్ ఓనర్ ఆపలేరన్నారు. తనకు ఆర్మూర్ గడ్డ అత్యధిక మెజారిటీ ఇచ్చి కవితను ఓటమి పాలు చేసిందన్నారు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు హత్యా రాజకీయాలకు, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పైడి సుచరితారెడ్డి, పల్లె గంగారెడ్డి, నూతుల శ్రీనివాస్ రెడ్డి, జెస్సు అనిల్ కుమార్, ఆలూర్ విజయభారతి, గెంట్యాల పండరి తదితరులు పాల్గొన్నారు.