మధ్యప్రదేశ్: తాగిన మత్తులో ఓ వ్యక్తి పులి బోనులోకి వెళ్లి ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. జీవితంపై విరక్తి చెందానని, ఇక బతకడం ఇష్టం లేదని, ఈ కష్టాలు భరించడం వల్ల కాని పనంటూ పులి నోట్లో పడబోయాడు. ఇండోర్ లోని కమలా నెహ్రూ ప్రాణి సంగ్రహాలయ అనే జూ లో జరిగిందీ ఘటన. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూ లోనికి ప్రవేశించిన ఆ వ్యక్తి 22 అడుగుల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. పులి బోనులోకి దిగడానికి ప్రయత్నించాడు. ఇదీ గమనించిన జూ సిబ్బంది, సందర్శకులు వెంటనే అతడిని ఫెన్సింగ్ పై నుంచి దింపటానికి నానా తంటాలు పడ్డారు.
మత్తులో ఉన్న అతనికి ఏవేవో మాయమాటలు చెప్పడంతో అరగంట తర్వాత క్రిందకు దిగాడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకోబోయానని, జీవితంపై విరక్తి చెంది ఈ సాహసం చేశానని ఆ వ్యక్తి (జాహ్లా) చెప్పాడు. తన ఆత్మహత్య చేసుకోవడానికి వేరెవరు కారణం కాదని తెలిపాడు.
ఆ తర్వాత జూ ఇన్ఛార్జి ఉత్తమ్ యాదవ్.. ఆ వ్యక్తిని సన్యోగితాగంజ్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించాడు. ఆ వ్యక్తి కుటుంబాన్ని పిలిపించామని, వారితో మాట్లాడి ఈ విషయం గురించి పరిశీలిస్తామని పోలీసు అధికారి పిసి చౌహాన్ తెలిపారు.