హైదరాబాద్, వెలుగు: దళిత బంధు, బీసీ బంధు లబ్ధిదారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. దళిత బంధు, బీసీ బంధు స్కీమ్లు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకే ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తిప్పర్తి మండలం హెడ్ క్వార్టర్స్ లో 566 మంది దళిత కుటుంబాలు ఉంటే, 12 దళిత బంధు యూనిట్లు ఇచ్చారని, అవి కూడా బీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలకే ఇచ్చారని తెలిపారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల నుంచి 30% కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. తిరుమలగిరి మండలానికి రూ.180 కోట్లు మంజూరైతే.. అందులో రూ.60 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ‘‘అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా శిక్షిస్తానని పదే పదే చెప్పే మీరు (కేసీఆర్).. దళితబంధు, బీసీ బంధులో జరుగుతున్న అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. కమీషన్ల వ్యవహారంపై మీకు కావాలంటే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇస్తా. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి” అని కేసీఆర్ను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. ఈ అంశంలో హైకోర్ట్లో పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు.