- అమిత్ షాకు ఎంపీ సోయం బాపురావు వినతి
న్యూఢిల్లీ, వెలుగు : లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎంపీ సోయం బాపురావు విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంటులో ఆదివాసీ నాయకులతో కలిసి షాతో ఎంపీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కోరుతూ నాలుగేండ్ల కిందే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈ కేసులో అభిప్రాయం తెలపాలంటూ కేంద్రంతో పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు.
ఈ నోటీసులపై కేంద్రం ఆగస్టు 11 లోపు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో కలిసి ఆదివాసీల సమస్యలను వివరించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపే కేంద్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేయాలని షాను కోరామని వెల్లడించారు. ఇదే అంశంపై గడిచిన రెండు రోజులుగా కేంద్ర న్యాయ శాఖ, గిరిజన శాఖ మంత్రులు అర్జున్ మేఘవాల్, అర్జున్ ముండాలను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాడుతామని ఎంపీ స్పష్టం చేశారు. ఆదివాసీ భూముల్లో లంబాడాలకు హక్కులు కలించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.