హైదరాబాద్ విలీన సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ పుట్టలేదు

హైదరాబాద్ విలీన సమయంలో బీజేపీ, టీఆర్ఎస్  పుట్టలేదు

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు మతపరమైన రంగు పూసి రాజకీయ లబ్ది పొందుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో  వేడుకలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశంలో హైదరాబాద్ విలీన సమయంలో బీజేపీ, TRS పార్టీలు  పుట్టలేదన్నారు. ఆనాడు కేంద్రంలో జవహార్ లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా  హుజుర్నగర్లో జరిగిన  తెలంగాణ  స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసు వ్యవస్థను కేసీఆర్ నాశనం చేసిండు..
ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు గౌరవం ఉండేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక పోలీసు వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో సుమారు 115 మంది ఐపీఎస్ అధికారులు ఉంటే 45 మందికి పోస్టింగ్ లేదన్నారు. సిన్సియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. కిందిస్థాయి నుంచి వచ్చిన IPS లకు  పోస్టింగ్ ఇచ్చి డైరెక్ట్  IPS లకు పోస్టింగ్ ఇవ్వకుండా కేసిఆర్ అవమానిస్తున్నారని విమర్శించారు. 

టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారు..
సూర్యాపేట జిల్లాలో ఎస్పీ ప్రోద్బలంతోనే టిఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ప్రభుత్వ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడం..ఎస్పీలతో ప్రభుత్వ కార్యక్రమంలో స్లోగన్స్ ఇప్పించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో కాళ్లు మొక్కిన కలెక్టర్ను సర్వీసు నుంచి రిలీవ్ చేసి..సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్కు కూడా ఎమ్మెల్సీ ఇస్తాడేమో అని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుందన్నారు. సీనియర్ నాయకులకు రెండు మండలాల చొప్పున ఇన్ చార్జీలుగా ఉన్నారని.. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.