చౌటుప్పల్, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ నాయకుల్లారా.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రెండు రోజుల కింద చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో జరిగిన గొడవలో గాయపడిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నవీన్, అమర్ ను మంగళవారం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సర్వేలన్నీ కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి ఎమ్మెల్యే కాబోతున్నారని చెబుతున్నాయని, అది ఓర్వలేకనే టీఆర్ఎస్, బీజేపీ లీడర్లు దాడులకు దిగుతున్నారన్నారు. తమ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్రెడ్డితో ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.