మేడారం జాతరకు పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపాలి: ఎంపీ వంశీకృష్ణ

మేడారం జాతరకు పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపాలి: ఎంపీ వంశీకృష్ణ
  • పెండింగ్‌‌లో ఉన్న రైల్వే నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు:  తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. పార్లమెంట్​  సభ్యుల వేతనాలు, పని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సమావేశం శనివారం కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ సమావేశానికి వంశీకృష్ణ హాజరై, మాట్లాడారు. మేడారానికి పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపడంతో పాటు రైల్వేకు సంబంధించి పెండింగ్‌‌లో ఉన్న నిర్మాణ పనులు, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పార్లమెంట్​ సభ్యుల జీతభత్యాల వ్యవస్థను పారదర్శకంగా రూపొందించాలని కోరారు. ప్రజాప్రతినిధులపై రోజురోజుకు పెరుగుతున్న బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం వంటి కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్‌‌లో నిరంతరం పనిచేస్తున్న ఎంపీల వేతనాలు, -భత్యాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వంశీకృష్ణ సూచనలపై కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారు.