ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానన్న చంద్రబాబుకు ..జగన్ కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదా అని ప్రశ్నించారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు అంటూ ఎద్దేవా చేశారు. తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన ‘ఆశా’ అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి చంద్రబాబు అరెస్ట్ చేయించాడని విమర్శించారు. సీఎం జగన్ ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారని.. పాలకుడికి, మ్యానిపులేటర్కి తేడా ఇదే అన్నారు విజయసాయి రెడ్డి.
జగన్ కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు విజయ సాయిరెడ్డి . బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్తో సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి.