
- మొదటి విడతలో 7,947 కి.మీ. నిర్మాణం: మంత్రి సీతక్క
- 15 రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్(హైబ్రిడ్ ఆన్యుటీ మోడ్) విధానం ద్వారా మొత్తం 18,472 కిలో మీటర్లు పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేస్తామని ఆశాఖ మంత్రి సీతక్క తెలిపారు. మొదటి విడతలో 7,947 కిలో మీటర్ల మేర రోడ్లను ఆధునీకరిస్తామన్నారు. 15 రోజుల్లో టెండర్లు వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు.
తన శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ దఫా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఈ ఏడాది ప్రతి మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,440 జీపీ భవనాలు, 1,440 అంగన్వాడీ భవనాలను నిర్మిస్తామన్నారు.
గ్రామ స్వరాజ్యం పంచాయతీరాజ్ శాఖ చేతుల్లోనే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలెన్నో పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. 93 వేల గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఎంపీడీవోల బదిలీలు ఫైల్ సీఎం దగ్గర, ఎంపీడీవోలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరిందని తెలిపారు. గ్రామ స్వరాజ్యం మన శాఖ చేతుల్లోనే ఉందని, కాబట్టి మనమంతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ఎంతో మంది ప్రజలతో పెనవేసుకున్నదని పేర్కొన్నారు.