రామాయంపేట పోలీస్ స్టేషన్ ముందు ముదిరాజ్ ల నిరసన

రామాయంపేట పోలీస్ స్టేషన్ ముందు ముదిరాజ్ ల నిరసన

రామాయంపేట, వెలుగు: రామాయంపేట ముదిరాజ్ సంఘంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం నిరసన తెలిపారు.  కొన్ని సంవత్సరాలుగా చేపల సంఘం నుంచి ముదిరాజ్ సంఘానికి రావలసిన డబ్బులను కొందరు పెద్ద మొత్తంలో కాజేశారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు పీఎస్​వద్దకు  చేరుకొని  నిరసన తెలిపారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ సంఘంలో సుమారు 800 వరకు సభ్యులు ఉండగా కేవలం 60 నుంచి 70  మంది మత్స్య సహకార సంఘం లో సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు.

పట్టణ  పరిధిలో మూడు చెరువులు ఉండగా, వాటిద్వారా వచ్చిన డబ్బులను సంఘానికి చెల్లించడం లేదన్నారు. ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు కాజేశారని ఆరోపించారు. పెద్దమ్మ ఆలయ అభివృద్ధి, ఉత్సవాలకు మల్లెచెరువు లోని చేపల హక్కును సంఘానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, డబ్బులను రికవరీ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.