
350 ఎకరాల భూమిని టీజీఐఐసీకి కేటాయింపు
పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి రూ.996 కోట్లతో టెండర్లు
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి
మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకు రవాణాకు చాన్స్
మెదక్/మనోహరాబాద్, వెలుగు : పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన మెదక్ జిల్లాలో త్వరలోనే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కానుంది. మనోహరాబాద్ మండలం పరికిబండలో నిర్మించే పార్క్ కోసం ఇప్పటికే రెవెన్యూ అధికారులు 350 ఎకరాల భూమిని సేకరించి టీజీఐఐసీకి అప్పగించారు. భూములు ఇచ్చిన రైతులకు రూ.45 కోట్ల పరిహారం చెల్లించారు. రూ. 996 కోట్ల అంచనాతో ఏర్పాటయ్యే లాజిస్టిక్పార్క్నిర్మాణానికి నేషనల్హైవే అథారిటీ ఆఫ్ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అనుబంధ జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సంస్థ ఇటీవల టెండర్లను కూడా పిలిచింది. పబ్లిక్, ప్రైవేటు పార్ట్ నర్ షిప్(పీపీపీ)లో దీన్ని నిర్మించనుంది.
రవాణాకు ఈజీగా ఉండగా..
పరికిబండ ప్రాంతం రవాణాకు ఈజీగా ఉండడంతో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఎంచుకుంది. ఇక్కడి నుంచి నేషనల్హైవే– 44 వెళ్తుండడంతోపాటు, దీనికి సమీపంలోనే మనోహరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి దగ్గరలోనే రీజినల్రింగ్రోడ్డు( ట్రిపుల్ఆర్)కూడా వెళ్లనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉండడంతో కూడా సరైనదిగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. సరుకులను రైలు నుంచి రోడ్డు మార్గాన, రోడ్డు మార్గం నుంచి రైలుకు మార్చే ఇంటర్ మోడల్ షిఫ్ట్ గోడౌన్లు, వ్యాల్యూ ఆడిట్ సర్వీసులు, ట్రక్పార్కింగ్, కమర్షియల్ ఏరియాలను ఏర్పాటు చేస్తారు.
డ్రైపోర్టు కూడా..
లాజిస్టిక్పార్క్ నిర్మాణమైతే సరుకు రవాణా, కార్గో సమీకరణ, పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ డ్రై పోర్టు కూడా నిర్మిస్తారు. తద్వారా నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చు. గతంలోనే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మనోహరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్హైవే ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిం చింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు అభివృద్ధి జరిగి మచిలీపట్నం వరకు రోడ్డు ఏర్పాటైతే, డ్రై పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
జిల్లా అభివృద్ధికి బాటలు
లాజిస్టిక్ పార్క్ ద్వారా మనోహరాబాద్, తూప్రాన్మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతా యి. ఇప్పటికే ఆయా మండలాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 200 వరకు ఉన్నాయి. ఇప్పుడు లాజిస్టిక్ పార్కు నిర్మాణమైతే జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్లనుంది. హైదరాబాద్ సిటీకి సమీపంలోని జిల్లా పరిధిలో మరెన్నో పరిశ్రమల ఏర్పాటుకు చాన్స్ ఉంది. లాజిస్టిక్పార్క్ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఉద్యోగ, అవకాశాలు కల్పించాలి
మా ఊరి శివారులో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు కొలువులు వస్తాయి. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో నిరుద్యోగుల్లోనూ ఆశలు చిగురించాయి. పార్క్ నిర్మాణం కోసం భూమి ఇచ్చిన కుటుంబాలకు ముందుగా ఉద్యోగ, అవకాశాలు కల్పించాలని కోరుతున్నా.
- మంచ శ్రీరామ్, పరికిబండ
ఊరు బాగుపడుతుందని భూములిచ్చాం
మా ఊర్లో పెద్ద కంపెనీ పడితే ఇక్కడి పోరగాళ్లకు కొలువులు వస్తాయి. దీంతో ఊరు కూడా బాగుపడుతుందని, పంటలు పండించుకునే భూములను సర్కార్ కు ఇచ్చినం. కంపెనీలు వస్తే ఊరోళ్లు కూడా అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకోవచ్చు.
ఏశం రాధ, రైతు, పరికిబండ