తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరకు వారం రోజుల సమయం మాత్రమే ఉందని, తుది దశకు చేరుకున్న అన్ని పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి, మెరుగులు దిద్దాలని ములుగు కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్ లో కలెక్టర్ ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడే అంశాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వంటివి నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జంపన్న వాగులో నిరంతరం షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ఇంజిన్లను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 18న మేడారంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు ఆఫీసర్లను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేశ్ పాల్గొన్నారు.
