థాయిలాండ్ నుంచి ఇండియాకు16 పాములు.. ఎయిర్పోర్టులో సీజ్

థాయిలాండ్ నుంచి ఇండియాకు16 పాములు.. ఎయిర్పోర్టులో సీజ్

బ్యాంకాక్, థాయిలాండ్ పాములన్నింటినీ ఇండియాలో డంప్ చేసే లక్ష్యంగా పెట్టుకున్నారా అన్నట్లుంది పరిస్థితి. తరచుగా ఆ దేశాల నుంచి పాములను తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. ఎన్నిసార్లు పట్టుకుని జైల్లో వేసినా.. వన్యప్రాణుల అక్రమ రవాణా ఆగటం లేదు. ఆదివారం (జూన్ 29) థాయిలాండ్ నుంచి  వివిధ రకాల పాములతో  వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ముంబై కస్టమ్స్ అధికారులు. 

థాయిలాండ్ నుంచి ఇండియాకు మరోసారి వన్యప్రాణుల స్మిగ్లింగ్ ముఠాను పట్టుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మొత్తం 16 బతికిన పాములను సీజ్ చేసి.. వాటిని తీసుకొచ్చిన ప్యాసెంజర్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దీని వెనుక ఉన్న ముఠాను అరెస్టు చేసేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

ఆదివారం తీసుకొచ్చిన పాములలో ఎక్కువగా విషం లేని పాములే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఉన్నా ప్రాణాంతక ప్రమాదకారి కావని చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా పసిరక పాములా కనిపించే రినో ర్యాట్ స్నేక్, కెన్యా శాండ్ బో (మట్టి పాము), చెట్లపై నివసించే గార్టర్ స్నేక్ ఉన్నట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు 7000 వన్య ప్రాణులు సీజ్:

గత మూడేళ్లలో ఇండియాకు ఇప్పటి వరకు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన వన్యప్రాణుల సంఖ్య 7 వేలకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. జూన్ ప్రారంభంలో డజన్ల కొద్దీ విషపూరిత వైపర్స్ (పెంజర  జాతికి చెందినవి) పాములను సీజ్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వందల కొద్ది వన్య ప్రాణులను సీజ్ చేశారు . అందులో రకరకాల బల్లులు, సన్ బర్డ్స్, చెట్టు ఎక్కే పొజమ్స్ (ఎలుక జాతి జంతువులు) లను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చి దొరికి పోయారు.