- ముంబైకి పొ‘లార్డ్’
- ఒంటిచేత్తో ఇండియన్స్ను గెలిపించిన కీరన్
- 219 టార్గెట్ ఛేజ్ చేసి చెన్నైపై అద్భుత విజయం
- రాయుడు మెరుపులు వృథా
హై ఓల్టేజ్.. హై స్కోరింగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది..! భారీ టార్గెట్ ఛేజింగ్లో పొలార్డ్ (34 బాల్స్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్).. సింగిల్ హ్యాండ్ పెర్ఫామెన్స్తో బలమైన చెన్నై సూపర్కింగ్స్ను చెడుగుడు ఆడుకున్నాడు..! ఆఖరి బాల్ వరకు క్రీజులో నిలిచి.. భారీ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు..! ఫలితంగా ముంబై నాలుగో విక్టరీతో మురిసిపోగా.. చెన్నై సెకండ్ ఓటమిని మూటగట్టుకుంది..! అంబటి రాయుడు (27 బాల్స్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్), మొయిన్ అలీ (36 బాల్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58), డుప్లెసిస్ (28 బాల్స్లో2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) బ్యాటింగ్లో రాణించినా.. బౌలింగ్ వైఫల్యంతో సీఎస్కే టార్గెట్ను కాపాడుకోలేకపోయింది..!!
న్యూఢిల్లీ: నాలుగొందలకు పైగా స్కోర్లు నమోదై.. ఆఖరి బాల్కు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. సమయానుకూలంగా రన్స్ చేస్తూ చెన్నై సృష్టించిన పరుగుల కొండను కరిగించేసింది. ఫలితంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 4 వికెట్లతో చెన్నైపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 218/4 స్కోరు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసి గెలిచింది. డికాక్ (28 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 38), రోహిత్ (24 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 35), క్రునాల్ (23 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) కూడా రాణించారు. పొలార్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మొయిన్, డుప్లెసిస్, రాయుడు మోత
ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై ఇన్నింగ్స్లో డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు పరుగుల మోత మోగించారు. ముంబై బౌలింగ్ సూపర్ స్టార్లందర్ని సిక్సర్లు, ఫోర్లతో ఉతికి ఆరేశారు. ఇన్నింగ్స్నాలుగో బాల్కు రుతురాజ్ (4) ఔటైనా.. స్టార్టింగ్లో మొయిన్, డుప్లెసిస్ దంచికొట్టారు. దాదాపు 10 ఓవర్లు ఈ ఇద్దరూ పరుగులు వర్షం కురిపిస్తే.. లాస్ట్లో రాయుడు ఏకంగా సునామీ సృష్టించాడు. ధవళ్వేసిన సెకండ్ ఓవర్లో డుప్లెసిస్ 4, 6 బాదితే, థర్డ్ ఓవర్లో అలీ సేమ్ సీన్ రిపీట్ చేయగా. పవర్ప్లేలో సీఎస్కే 49/1 స్కోరు చేసింది. నీషమ్ బౌలింగ్లో అలీ 6, 4, 4తో 18 రన్స్ పిండుకున్నాడు. చహర్ వేసిన 9వ ఓవర్లో అలీ, ఫా.. చెరో సిక్సర్ బాదడంతో ఫస్ట్ టెన్లో 95/1 స్కోరు చేసింది. 33 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న అలీ.. సెకండ్ స్పెల్కు వచ్చిన బుమ్రా బౌలింగ్లో 6, 6, 4తో రెచ్చిపోయాడు. అయితే ఓ స్లో బౌన్సర్కు డికాక్కు క్యాచ్ఇచ్చి ఔట్కావడంతో సెకండ్ వికెట్కు 108 పార్ట్నర్షిప్ ముగిసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్కు 12వ ఓవర్లో పొలార్డ్ (2/12) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్లో డుప్లెసిస్, రైనా (2)ను ఔట్ చేయడంతో ముంబై పుంజుకుంది. చెన్నై స్కోరు 116/4. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ ఎండ్లో జడేజా (22 నాటౌట్)ను నిలబెట్టి.. తాను ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 13, 14 ఓవర్లలో మెల్లగా ఆడిన రాయుడు స్లాగ్ ఓవర్స్లో తన పవర్ హిట్టింగ్ను చూపెట్టాడు. చహర్ బౌలింగ్లో సిక్సర్తో గేర్ మార్చాడు. కులకర్ణి వేసిన 16వ ఓవర్లో లాంగాన్ రెండు టవరింగ్ సిక్సర్లతో ఆటను మరో మెట్టు ఎక్కించాడు. 17వ ఓవర్లో జడ్డూ ఫోర్ కొట్టినా, రాయుడు 6, 4తో 21 రన్స్ పిండుకున్నాడు. బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 6, 4, 6తో 20 రన్స్ చేసి 20 బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. 19వ ఓవర్లో బుమ్రా పది రన్సే ఇచ్చినా, లాస్ట్ ఓవర్లో 6, 4 తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంబటి దెబ్బకు లాస్ట్8 ఓవర్లలో సీఎస్కే 102 రన్స్ చేసింది.
పొలార్డ్ ఫటాఫట్..
కళ్లముందు భారీ టార్గెట్ ఉండటంతో.. ముంబై కూడా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఫోర్తో ఖాతా మొదలుపెట్టిన డికాక్ .. థర్డ్ ఓవర్లో సిక్స్ కొడితే, రోహిత్ నాలుగు ఫోర్లు, సిక్సర్తో జోరు పెంచడంతో పవర్ప్లేలో ముంబై 58/0తో నిలిచింది. అయితే, ఎనిమిదో ఓవర్లో రోహిత్ను ఔట్ చేసిన శార్దూల్ ఫస్ట్ వికెట్కు 71 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఆ వెంటనే సూర్యకుమార్ (3)ను జడేజా, డికాక్ను అలీ ఔట్ చేయడంతో ముంబై 10 ఓవర్లలో 81/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రునాల్ తో కలిసి పొలార్డ్ పోరాటం మొదలుపెట్టాడు. 12వ ఓవర్లో క్రునాల్ సిక్సర్తో రెచ్చిపోతే.. 13వ ఓవర్లో పొలార్డ్ ఏకంగా మూడు సిక్సర్లతో 20 రన్స్ దంచాడు. ఎంగిడి వేసిన 14వ ఓవర్లోనూ పొలార్డ్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. 15వ ఓవర్లో 6, 4, 4, 4 తో 17 బాల్స్లో ఫిఫ్టీ (ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్) కంప్లీట్ చేశాడు. టీమ్ స్కోరు 153/3కి పెంచాడు. 16వ ఓవర్ (ఎంగిడి) 6, 4, 4తో క్రునాల్ 16 రన్స్ రాబట్టడంతో మ్యాచ్ ముంబై వైపు వెళ్లింది. 17వ ఓవర్లో క్రునాల్ను ఔట్ చేసిన కరన్ రెండు రన్సే ఇవ్వడంతో విజయ సమీకరణం 18 బాల్స్లో 48గా మారింది. 18వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన పొలార్డ్.. ఐదో బాల్కు ఇచ్చిన ఈజీ క్యాచ్ను డుప్లెసిస్ డ్రాప్ చేసి మూల్యం చెల్లించాడు. తర్వాతి ఓవర్లో 6, 6 కొట్టిన హార్దిక్ (16), నీషమ్ (0) ఔటయ్యారు. ఎంగిడి వేసిన లాస్ట్ ఓవర్లో 16 రన్స్ అవసరం అవగా.. టెన్షన్ పీక్ స్టేజ్కు చేరింది. సెకండ్, థర్డ్ బాల్స్కు 4, 4 .. ఐదో బాల్కు సిక్సర్ కొట్టిన పొలార్డ్ లాస్ట్ బాల్కు డబుల్తో ముంబైని గెలిపించాడు.