ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఎయిరిండియా ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది. దీని గురించి చెప్పినా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. దీంతో ఎయిరిండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిందితుడిపై ఎయిర్లైన్ 30 రోజుల నిషేధం విధించింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శంకర్ కనిపించకుండా పోయాడు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సమయంలోనే అతడు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ స్విచాఫ్ చేసినప్పటికీ.. సోషల్మీడియా, క్రెడిట్ కార్డులను వినియోగించారని, దానివల్లే ఆచూకీ గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన శంకర్ మిశ్రా.. బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించానని, వివాదం అక్కడితో సమసిపోయిందని తెలిపారు. అయితే నష్టపరిహారం చెల్లించిన నెల రోజుల తర్వాత బాధితురాలి కుమార్తె ఆ డబ్బును తిరిగి పంపించేశారని వివరించారు. ఈ మేరకు మిశ్రా తరపు న్యాయవాదులు ఓ ప్రకటనను విడుదల చేశారు. బాధితురాలి పాడైపోయిన బ్యాగ్, దుస్తులను మిశ్రాకు పంపారని, ఆయన వాటిని ఉతికించి నవంబరు 30నే ఆవిడకు అందజేశారన్నారు. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ మిశ్రాను.. ఘటన నేపథ్యంలో సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.