కరోనాతో హెడ్ కానిస్టేబుల్‌ మృతి

కరోనాతో హెడ్ కానిస్టేబుల్‌ మృతి

కరోనా వైరస్ బారి నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు రాత్రింబవళ్లు తమ ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతున్నారు పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు. ఈ ప్రాణాంత‌క వ్యాధి వైద్యుల‌ను కూడా పొట్ట‌న పెట్టుకుంది. తాజాగా ఆదివారం ఈ మ‌హమ్మారి కార‌ణంగా ముంబైలో 52 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ముంబైలోని ప్రొటెక్షన్‌ బ్రాంచ్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సందీప్ ‌ సర్వీ(52)… లాక్‌డౌన్ నేపథ్యంలో త‌న విధులు కొన‌సాగించారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయ‌న‌.. వైరస్‌ లక్షణాలతో ఏప్రిల్‌ 23న నగరంలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7.30గంటల ప్రాంతంలో మృతిచెందారు. దీంతో గత 24 గంటల్లో ఈ వైరస్‌ ప్రభావంతో మరణించిన ముంబై పోలీసుల సంఖ్య రెండుకు చేరింది. అంతకుమందు శనివారం సాయంత్రం చంద్ర‌కాంత్(57) అనే పోలీస్‌ కానిస్టేబుల్ కూడా ఈ వైర‌స్ కార‌ణంగానే‌ ముంబైలోని ఆసుపత్రిలో చనిపోయారు. కాగా, ముంబైలో ఇప్పటివరకు 39 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారంతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Sandip M. Surve