బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మునిరాజ్​

బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మునిరాజ్​
  • జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రవాస్​ యోజన ప్రోగ్రామ్స్​
  • పాల్గొన్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు
  • రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ధేశం

నిజామాబాద్​అర్బన్, వెలుగు : కార్యకర్తలే బీజేపీకి బలమని, వారు వేసిన పునాదులపైనే పార్టీ మరింత బలోపేతమవుతోందని కర్నాటక రాష్ట్ర, దాసరల్లి ఎమ్మెల్యే మునిరాజ్​ పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల ప్రవాస్ యోజనలో భాగంగా నిజామాబాద్ నగరానికి వచ్చిన మునిరాజ్ అర్బన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు బుద్ధిచెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్ సూర్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి : కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మహారాష్ట్ర, అక్కల్​కోట ఎమ్మెల్యే  సచిన్​కల్యాణ్​ శెట్టి పేర్కొన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలోని పార్టీ శ్రేణులతో జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్​లో నిర్వహించిన మీటింగ్​ లో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలోని ఆయా మండలాల వారిగా లీడర్లతో మాట్లాడి పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రతీ బూత్​లో 50 మంది కార్యకర్తలను తయారు చేయాలని సూచించారు. నియోజక వర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, వరంగల్​ జిల్లా ఇన్​చార్జి వి.మురళీధర్​గౌడ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కర్నాటక స్టేట్ హరిహర నియోజకవర్గ ఎమ్మెల్యే బీపీ హరీశ్​వచ్చారు.

ఆర్మూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డిని ఓడించేందుకు కంకణం కట్టుకోవాలని, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మహారాష్ట్ర, వాణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్​రెడ్డి బాపు రావు పేర్కొన్నారు. ఆర్మూర్ లోని ఎంపీ అర్వింద్​ ఇంట్లో పార్టీ అసెంబ్లీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. లీడర్లు అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దొళ్ల గంగారెడ్డి, మారంపల్లి గంగాధర్ పాల్గొన్నారు.

బోధన్ : బీజేపీ కుటుంబ పార్టీ కాదని, కార్యకర్తలే పార్టీ కుటుంబ సభ్యులని మహారాష్ట్ర, పండిపూర్​ఎమ్మెల్యే సమాధాన్​మహాదేవ్​ఔతాడే పేర్కొన్నారు.  ఎమ్మెల్యే ప్రవాస్ ​యోజనలో భాగంగా బోధన్​ఎంపీఆర్​ ఆఫీస్​ కార్యకర్తలతో మాట్లాడి పార్టీ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డి, వడ్డీ మోహన్​రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్​ పాల్గొన్నారు.

ధర్పల్లి : లీడర్లు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తోందని అస్సోం, నహరకటియా ఎమ్మెల్యే తరంగ్​ గగోయ్​ పేర్కొన్నారు. ఆదివారం ధర్పల్లిలోని గురడికాపు సంఘంలో నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గ లీడర్లతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో బీజేపీ రూరల్ ఇన్​చార్జి దినేశ్​​కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.

మోర్తాడ్ : వచ్చే ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కర్నాటక, నిప్పాని ఎమ్మెల్వే జోల్లే శశికళ కార్యకర్తలకు నిర్ధేశం చేశారు. ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ముప్కాల్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.