కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎవరూ విడదీయలేరు: రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎవరూ విడదీయలేరు: రాజగోపాల్ రెడ్డి

భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.  ఎంపీ టికెట్ కోసం తన  భార్య లక్ష్మీ  ప్రయత్నించలేదు...  ఒక వేళ పార్టీ ఆదేశిస్తే  పోటీ చేయడానికి సిద్దమన్నారు రాజగోపాల్ రెడ్డి. తన కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదన్నారు. భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించానని చెప్పారు.  పార్టీలకు అతీతంగా కోమటిరెడ్డి  లక్ష్మికి భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ప్రజల్లో చర్చ ఉందన్నారు.

పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి నుంచి ఎవరికీ టికెట్ ఇచ్చిన భారీ మెజారిటీ తో గెలిపిస్తామని చెప్పారు.  తెలంగాణలో 12నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. ఎన్నికల కోడ్ తో మంత్రి వర్గ విస్తరణ ఆగిపోయిందన్నారు.   బీజేపీ తెలంగాణలో లేదన్నారు. మునుగోడును అన్ని కోణాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు

కోమటిరెడ్డి బ్రదర్స్ ను  విడదీయాలని కొందరు  ప్రయత్నిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.   ప్రాణమున్నంత సేపు తాము కలిసే ఉంటామన్నారు.  కోమటి రెడ్డి బ్రదర్స్ ను ఎవరూ విడదీయలేరని చెప్పారు. తాము పదవుల కోసం పాకులాడటం లేదన్నారు. భవిష్యత్ లో బీఆర్ ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. బీఆర్ఎస్  నుంచి వచ్చే వారికీ  స్వాగతం పలుకుతున్నామన్నారు.