
నల్గొండ: తెలంగాణ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేశారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మునుగోడు ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. వెయ్యి మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకుంటే రాష్ట్రం వచ్చిందే తప్ప.. కేసీఆర్ వల్ల కాదని అన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. సిద్ధిపేట, సిరిసిల్లా, మెదక్ జిల్లాలను మాత్రమే కేసీఆర్ పట్టించుకుంటున్నారని అన్నారు. ప్రగతి భవన్, ఫాం హౌజ్ కు వెళ్లే రోడ్లతో పోల్చితే మునుగోడు రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏనాడు కనపడని వ్యక్తులు ఇవాళ అధికారాన్ని వెలగబెడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి... అసలైన ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను దూరం కొట్టినప్పుడే కేసీఆర్ పతనం మొదలైందన్నారు. తాను, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెలంగాణ కోసం పార్టీని ఎదిరించి సస్పెండ్ అయ్యామని గుర్తు చేశారు.
దమ్ముంటే కేసీఆర్ నాపై పోటీ చేయాలె
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లాంటి జోకర్లు కాదు.. దమ్ముంటే సీఎం కేసీఆర్ తనపై పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరారు. కేసీఆర్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. వ్యక్తిగత స్వార్ధం కోసం తాను పార్టీ మారలేదని, తన మీద కక్షతో కేసీఆర్ నిధులు రాకుండా చేసి మునుగోడు అభివృద్ధిని అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. అది చూసి తట్టుకోలేకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవమని, అయితే ఆ పార్టీ ఇవాళ రాష్ట్రంలో చిల్లర దొంగ చేతుల్లోకి వెళ్లిందని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి కింద పనిచేయడం తనకు ఏమాత్రం ఇష్టంలేదని తెలిపారు. దేశ భద్రత, భవిష్యత్ అన్ని ఇవాళ మోడీ, అమిత్ షా చేతుల్లో ఉన్నాయని, వారి ఆధ్వర్యంలో దేశం ముందుకు పోతోందని తెలిపారు. మునుగోడు ఎన్నికలో తనను గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.