
సరిగ్గా 117 సంవత్సరాల క్రితం.. అంటే 1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ లో మూసీ వరద విలయతాండవం చేసింది. మళ్లీ ఇప్పుడు 2025లో సెప్టెంబర్ 26 వ తేది అర్దరాత్రి మూసీనది విధ్వంసం సృష్టించింది.
హైదరాబాద్ చెరగని చీకటి అధ్యాయంగా... మూసీనది వరద మరోసారి ( 2025 సెప్టెంబర్ 27 వతేది) విజృంభించింది. ప్రజలు.. అధికారులు ఊహించని విధంగా జల ప్రళయంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. దసరా పండుగకు జనాలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమయ్యే సమయంలో .. ఎంజీబీఎస్ బస్టాండ్ సముద్రాన్ని తలపించింది. ఏకంగా బస్టాండ్ మొత్తం జలదిగ్భంధంలో కూరుకుపోయి.. బస్సు మునిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో నగరానికి వరద ముప్పు వాటిల్లింది. మూసీ తీరంపై క్లౌడ్ బరస్ట్ (మేఘ విచ్ఛిత్తి) ఉగ్రరూపాన్ని చూపింది.
వారం రోజుల నుంచి హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ( సెప్టెంబర్ 26 ) రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారడంతో ... జంట జలాశయాల గేట్లు ఎత్తారు. వరద తాకిడికి మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అందరూ నిద్రా వస్తలో ఉన్న సమయంలో అంటే శుక్రవారం ( సెప్టెంబర్ 26 ) అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు.
మూసీ ఉధృతి కేవలం బస్టాండ్కే పరిమితం కాలేదు. చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. .
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమై పోతుంది. వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు రాజధాని రహదారులు ఏరులను తలపించాయి. రోడ్లన్నీ ద్వంసమయ్యాయి. వరద నీళ్లతో కాలనీలు నిండిపోయాయి. ఇండ్లు, అపార్ట్ మెంట్లలోకి కూడా నీళ్లు చొచ్చుకొని పచ్చాయి. నగర జీవితం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
1908 సెప్టెంబర్ 27న ఉదయం 11 గంటలకు మూసీ నది నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. అంతకు రెండు రోజుల క్రితం తుంపరలుగా మొదలైన వర్షం భీకరంగా మారింది. ఆరోజు(1908 సెప్టెంబర్ 27) రాత్రి 15.38 సెంటీ మీటర్ల వర్షంతో సిటీ అతలాకుతలమైంది. పరీవాహక ప్రాంతంలో నీ చెరువులు నిండిపోయాయి శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీ మీటర్లువర్షం కురిసింది.
మూసీ నది రెండు ఒడ్డులమధ్య దూరం 700 అడుగులే. కానీ వరదల సమయంలో కిలో మీటర్ కు మించిపోయింది. మూసీ నీళ్లు ఏరులై పారి అర్థరాత్రి జల విలయం సృష్టించాయి . ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు. పేట్లబురుజు ప్రాంతంలో వంతెనల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మరో 2 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. కొన్ని జిల్లాల్లో అతిభారీగా పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.