- లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 32 వేల ఎకరాలకుపైగా సేకరించిన ఆఫీసర్లు
- వందల ఎకరాలు ప్రాజెక్టు పేరున బదిలీకాక క్షేత్రస్థాయిలో అక్రమాలు
- సర్వే నెంబర్ల మిస్ మ్యాచింగ్తో మ్యుటేషన్కు అడ్డంకులు
- ఇప్పటికీ దేవాదుల భూముల్లో ఆగని కబ్జాలు
హనుమకొండ, వెలుగు: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం సేకరించిన భూములను ప్రాజెక్టు పేరున బదలాయించే ప్రక్రియ డెడ్ స్లోగా నడుస్తోంది. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని ఎప్పటికప్పుడు పథకం పేరున మ్యుటేషన్ కావాల్సి ఉండగా.. ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. దీంతో మ్యుటేషన్ కాని దేవాదుల భూములతో కొంతమంది దందా సాగిస్తుండగా.. మూడు నెలల కిందట ‘వెలుగు’లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు మేల్కొన్నారు.
వెంటనే దేవాదుల, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని మ్యుటేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో వివిధ సమస్యల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా దేవాదుల ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ఇప్పటికీ ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి.
మ్యుటేషన్ కాని భూములతో దందా
ఉమ్మడి వరంగల్ జిల్లాను సూర్యాపేట, ఖమ్మం చివరి ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు 2004లో అప్పటి ప్రభుత్వం జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి, వివిధ జిల్లాల్లోని 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంగా పనులు చేపట్టగా.. ప్రాజెక్టు ఏర్పాటు నుంచి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కోసం మొత్తంగా 34,668 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఇప్పటివరకు 32,488 భూమిని సేకరించగా.. ఇంకో 2,180 ఎకరాలు పెండింగ్లో ఉన్నాయి. కాగా మిగతా భూమిని కూడా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సేకరించిన భూమిలో వందల ఎకరాలు ప్రాజెక్టు పేరున మ్యుటేషన్ కాలేదు. ఇలా మ్యుటేషన్ కాని భూములు ఇప్పటికీ పాత పట్టాదారుల పేరునే చూపిస్తుండటంతో కొంతమంది వాటిని దున్నుకుంటుండగా.. ఇంకొంతమంది ఇతరులకు అమ్మేశారు. ఇంకొన్నిచోట్ల రియల్టర్లు ఎంటరై దేవాదుల భూములతో దందా
చేస్తున్నారు.
మ్యుటేషన్ ప్రక్రియను పట్టించుకోలే..
దేవాదుల కోసం సేకరించిన భూముల్లో వందల ఎకరాలు ప్రాజెక్టు పేరున బదిలీకాలేదు. పరిహారం చెల్లించిన ఇరిగేషన్ ఆఫీసర్లు లైట్ తీసుకోవడం, రెవెన్యూ ఆఫీసర్లు కూడా మ్యుటేషన్ ప్రక్రియ గురించి ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇలా మ్యుటేషన్ కాని భూములు ఒక్క హనుమకొండ జిల్లాలోనే 1,538 ఎకరాలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ భూములతో కొంతమంది రియల్టర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై దందా చేస్తుండటంతో ఈ ఏడాది మార్చి 24న ‘వెలుగు’ పేపర్లో ‘ఆక్రమణల చెరలో దేవాదుల భూములు’ అనే వార్త పబ్లిష్ అయ్యింది.
దీంతో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ స్పందించి ప్రాజెక్టు భూములపై రివ్యూ చేశారు. ప్రాజెక్టు కింద సేకరించిన భూములను త్వరితగతిన మ్యుటేషన్ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలోని మండలాల రెవెన్యూ సిబ్బంది వరంగల్ ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ కలెక్టర్ ఆఫీస్ నుంచి అవార్డ్ కాపీలు సేకరించి, రికార్డ్స్ వెరిఫై చేశారు.
సర్వే నంబర్ల మిస్మ్యాచ్తో తిప్పలు
దేవాదుల ప్రాజెక్టుకు భూములు సేకరించే క్రమంలో అప్పటి అధికారులు ఫీల్డ్లో ఉన్న రైతుల వివరాలు సేకరించి పరిహారం చెల్లించారు. కానీ భూసేకరణ, పరిహారం చెల్లించే సమయంలో ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించలేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే చాలాచోట్లా సర్వే నంబర్లు మ్యాచ్ కావడం లేదని తెలిసింది. ఫలితంగా మ్యుటేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిసింది.
ఉదాహరణకు ధర్మసాగర్ మండలం ధర్మసాగర్, ఉనికిచెర్ల గ్రామాల శివారులో 89.25 ఎకరాలు మ్యుటేషన్ చేయాల్సి ఉండగా.. అందులో 59 ఎకరాల వరకు మాత్రమే మ్యుటేషన్ రిక్వెస్ట్ పెట్టినట్లు తెలిసింది. సర్వే నంబర్ మిస్ మ్యాచ్ కారణంగా మిగతా భూమిని మ్యుటేషన్ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కలెక్టర్ ఆదేశించినా మ్యుటేషన్ ప్రకియ ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవాదుల భూముల్లో ఆగని ఆక్రమణలు
మ్యుటేషన్ ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతుండగా.. క్షేత్రస్థాయి లూప్ హోల్స్ ఆధారంగా కొంతమంది దేవాదుల భూములకు ఎసరు పెడుతుండటం గమనార్హం. ఇప్పటికే ధర్మసాగర్, ఉనికిచెర్ల, దేవన్నపేట, హసన్పర్తి తదితర చోట్ల దేవాదుల భూములు ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణలుండగా.. తాజాగా హసన్పర్తి మండలకేంద్రంలో కొందరు రియల్టర్లు వెంచర్ ఏర్పాటు కోసం దేవాదుల పైపులైన్కు సంబంధించిన భూమిని చదును చేయడం గమనార్హం. గతంలో ఈ భూమిని దేవాదుల పైపులైన్ కోసం సేకరించగా.. మ్యుటేషన్ కాలేదనే సాకుతో వెంచర్ చేస్తున్నట్లు సమాచారం. ఇకనైనా దేవాదుల ప్రాజెక్టు కింద సేకరించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి, క్షేత్రస్థాయిలో అక్రమాలకు చెక్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
