- మాటలు రాకపోవడంతో అరవలేకపోయిన బాలుడు
- ఊడిపోయిన చెవి, రక్తసిక్తమైన శరీరం
- హయత్ నగర్ శివగంగకాలనీ లో ఘటన
- జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారులో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా హయత్ నగర్లోని శివగంగ కాలనీలో కుక్కల స్వైరవిహారానికి ఏడేండ్ల మూగ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాటలు రాకపోవడంతో సాయం కోసం అరవలేని బాలుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ఊడిపోయిన చెవి, రక్తసిక్తమైన బాలుడి శరీరాన్ని చూసి అందరి హృదయాలు ధ్రవించాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. తాపీ పనులు చేసుకుంటూ హయత్ నగర్ శివగంగ కాలనీలో మూడేండ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు ప్రేమ్ చంద్ (7) పుట్టుకతోనే మూగవాడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో తాగునీరు పడుతుంది.
ఆ క్రమంలో ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వచ్చిన ప్రేమ్ చంద్పై దాదాపు 10 నుంచి 12 వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. స్థానికులు గమనించి కుక్కల్ని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలుడి చెవి ఊడిపోగా, మెడ, చెవి, నడుము, పిక్కలతోపాటు శరీరమంతా తీవ్ర గాయాలతో రక్తసిక్తమైంది.
వైద్య ఖర్చులను జీహెచ్ఎంసీనే భరించాలి
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలు పెరిగిపోయి తాము బయటకు వెళ్లాలంటేనే ఎంతో భయపడుతున్నామని, ఈ విషయమై ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాలుడి వైద్యానికి సంబంధించిన ఖర్చులను జీహెచ్ఎంసీ భరించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇలాంటి సంఘటనలు తరుచుగా రిపీట్ అవుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
