కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మికుల కోసం ప్రముఖ సినీ స్టార్స్ తమ వంతు సాయాన్నిఅందిస్తున్నారు. వారి కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
లాక్ డౌన్ తో రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు సినీ నటుడు నాగార్జున. 21 రోజుల లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు నాగ్. లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని… అందరూ ఇంటిలోనే ఉండి విధిగా పాటించాలని కోరారు.
ఇక ఇప్పటికే కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు తన వంతు సాయంగా తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన సినీ నటుడు మహేశ్ బాబు.. సినీ కార్మికులకు అండగా నిలిచాడు. సినీ వర్కర్స్ ఛారిటీకి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మొత్తంగా కోటి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.