నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలో గృహ అవసరాలకు కేటాయించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అమరేందర్, గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగాన్ని అరికట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డీటీలు, ఎస్ఐలతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో గ్యాస్ సరఫరా చేయాలని, ఆస్పత్రులు, వసతి గృహాలకు నిబంధనల మేరకు సరఫరా కొనసాగించాలని సూచించారు.
