
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అటు వైపు తెలంగాణ అధికారులు రాకుండా ఏపీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మోటార్లకు సపరేట్ గా విద్యుత్ సరఫరాను ఏపీ ఇంజనీరింగ్ అధికారులు కనెక్ట్ చేశారు. దీంతో నాగార్జునసాగర్ పై ఏపీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల పహారా కొనసాగుతుంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసులు ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక విద్యుత్ తో కుడి కాల్వకు నీటిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారులు విడుదల చేసుకున్నారు. ఇక, 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో డెడ్ స్టోరేజ్ కు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేరుకోనుంది. దీంతో నాగార్జు సాగర్ డ్యామ్ దగ్గర మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు.