ఈ నెల 21న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

ఈ నెల 21న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

ఆదిలాబాద్​ జిల్లా కేస్లాపూర్​లోని నాగోబా జాతరకు మెస్రం వంశీయులు  శ్రీకారం చుట్టారు.  గంగా జలం కోసం ఆదివారం హస్తిన మడుగుకు పయనమయ్యారు. ఈ నెల 21న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. 

ఆదిలాబాద్, వెలుగు: దేశంలో సమ్మక్క సారక్క తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. నాగోబాను అభిషేకించే గంగా జలం కోసం ఆదివారం హస్తిన మడుగుకు పయనమయ్యారు. ఏటా పుష్యమాసంలో నిర్వహించే నాగోబా జాతర ఈ నెల 21న మహాపూజతో ప్రారంభం కానుంది. 24న గిరిజన దర్బార్ తో జాతర ముగుస్తుంది. జాతర ప్రారంభానికి అవసరమయ్యే గంగా జలాన్ని 75 కిలోమీటర్ల దూరంలోని జన్నారం మండలం హస్తిన మడుగు నుంచి తెస్తారు. దీంతో133 మంది మెస్రం వంశీయులు కాలినడకన ఆదివారం హస్తిన మడుగుకు బయల్దేరారు.

వారం రోజులుగా మెస్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించిన మెస్రం పెద్దలు.. ఆదివారం కేస్లాపూర్ చేరుకున్నారు. అక్కడ నాగోబా ఆలయ పెద్ద మెస్రం వెంకట్ రావ్ అధ్వర్యంలో సమావేశమై గంగాజల పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. మెస్రం వంశ ఆడపడుచులు బుందో పట్టుకోగా మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. మొదటి రోజు కేస్లాపూర్ నుంచి బయల్దేరిన మెస్రం వంశీయులు.. మండలంలోని పిట్టబొంగరం గ్రామానికి చేరుకొని అక్కడ బస చేయనున్నారు. ఈ నెల 2 న ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్, 3న గాదిగూడ మండలంలోని లోకారి, 4న గాదిగూడ మండలంలోని బోడిగూడ, 5న గాదిగూడ మండలంలోని గణేశ్ పూర్, 6న జైనూర్ మండలంలోని లేండిజాల, 7న జైనూర్, 8న లింగాపూర్ మండలంలోని గుమ్నూర్, 9న దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్ గ్రామాల గుండా యాత్ర సాగుతుంది. ఈ నెల 10న జన్నారం మండలంలోని గోదావరి నది హస్తిన మడుగుకు చేరుకొని ప్రత్యేక పూజల మధ్య పవిత్రమైన గంగా జలం సేకరిస్తారు.