మున్సిపోల్స్లో కోట్లు సంపాదించిండు
మంత్రిపై మాజీ మంత్రి నాయిని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తడు. మున్సిపల్ ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’ అని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ‘నాచారంలోని లిక్కర్ ఇండియా కంపెనీ దగ్గర మంత్రి డబ్బులు తీసుకొని 9 మంది కార్మికుల పొట్టగొట్టిండు’ అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టైంలో మల్లారెడ్డి పై వచ్చిన విమర్శలను కూడా గుర్తు చేశారు. ‘టికెట్లు అమ్మి మంత్రి కోట్లు సంపాదించిండు. అసెంబ్లీ ఎలక్షన్ల పెట్టిన ఖర్చును మున్సిపల్ ఎన్నికల్లో కలెక్ట్ చేసిండు’అని అన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్కూ ఫిర్యాదు చేశానన్నారు. ‘మల్లారెడ్డి గురించి కేటీఆర్కు చెప్పిన. అప్పుడు ఆయన.. మల్లారెడ్డి ముందు ఈ విషయాలన్నీ చెప్పుతవా అని అడిగారు. చెప్పమంటే చెప్త. వద్దంటే ఊరుకుంట అన్న’ అని నాయిని చెప్పారు. రాజ్యసభ పంపుతారని హామీ ఉంది. రాజ్యసభ సీటు తనకే వస్తుందని నాయిని ధీమాగా ఉన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సీఎంను చాంబర్లో కలిశారు. ‘సార్ను కలిసి నమస్తే చెప్పా. అట్లయితే ఇచ్చిన హామీ గుర్తుకొస్తది గదా. కేబినెట్లోకి తీసుకోక పోతే రాజ్యసభ ఇవ్వమని కేబినెట్ విస్తరణ టైంలో అడిగా. బర్త్డే రోజు కలిసినప్పుడూ అడిగా. చూసుకుంటా నన్నా.. ఫికర్ పడకు అని సీఎం చెప్పిన్రు’ అని నాయిని అన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవి తన హోదాకు సరిపోదన్నారు. ఏదో ఓ పదవిస్తమని, అప్పటి వరకు మంత్రి క్వార్టర్స్ ఖాళీ చేయొద్దని సీఎం తనకు చెప్పారని తెలిపారు.