తమిళనాడులో పురుడు పోసుకున్న మరో కొత్త రాజకీయ పార్టీ.. శశికళ పార్టీ జెండా ఇదే..!

తమిళనాడులో పురుడు పోసుకున్న మరో కొత్త రాజకీయ పార్టీ.. శశికళ పార్టీ జెండా ఇదే..!

చెన్నై: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. దివంగత నేత, మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తన రాజకీయ పార్టీ జెండాను కూడా ఆమె ఆవిష్కరించారు. రామనాథపురం సభలో శశికళ ఈ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని ఆమె చెప్పారు. రాజకీయాల్లో తన మార్క్‌ ఏంటో చూపిస్తానని ఆమె చెప్పడం విశేషం.

జయలలితను తానే చంపానని దుష్ప్రచారం చేశారని, పళనిస్వామిని సీఎం చేసి తప్పు చేశానని ఆమె పశ్చాతాపం వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారని జయలలిత చనిపోయిన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుని శశికళ భావోద్వేగానికి లోనయ్యారు. ఎడప్పాడి పళని స్వామి టార్గెట్గా శశికళ రాజకీయ పార్టీ కార్యకలాపాలు ఉండనున్నాయని ఈ ప్రకటనతో స్పష్టమైంది.

రామనాథపురం బహిరంగ సభలో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ మాట్లాడుతూ, "తమిళనాడులో మనం కొత్త రాజకీయ అధ్యాయాన్ని చూడబోతున్నాం. మేము కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీ ద్రావిడ ఉద్యమం.. అన్నాదురై, పురచ్చి తలైవర్ ఎం.జి.ఆర్, పురచ్చి తలైవి అమ్మ చూపిన బాటలో నడుస్తుంది. ఈ రాజకీయ పార్టీ పేదలు, అణగారిన వర్గాలు, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ.

►ALSO READ | కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కేరళ రాష్ట్రం పేరు మారింది.. ఇకపై కేరళం

రాజకీయం పేరుతో స్వార్థ రాజకీయాల ముసుగులో తమిళనాడుకు చేటు చేస్తున్న శత్రువులను, ద్రోహులను నిర్మూలించే పార్టీ. మా పార్టీ జెండాను రామనాథపురంలో ఆవిష్కరిస్తున్నాను. ఇందుకు నేను సంతోషిస్తున్నాను. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా పెరారిగ్నార్ అన్నా, పురచ్చి తలైవర్ ఎం.జి.ఆర్, పురచ్చి తలైవి అమ్మ (జయలలిత) చిత్రాలను కలిగి గర్వంగా రెపరెపలాడుతుంది. పార్టీ పేరు త్వరలో ప్రకటిస్తాం." అని వీకే శశికళ చెప్పారు.