దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో మర్డర్ సినిమా తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా ఆర్జీవీ మర్డర్ సినిమా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాపై ప్రణయ్ భార్య అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది.
