భారత పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోడీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘చెడు వినకు.. చెడు అనకు.. చెడు చూడకు’ అని చెప్పే మహాత్మా గాంధీ మూడు కోతుల మార్బుల్ శిల్పాన్ని బహూకరించారు. రెండ్రోజుల టూర్లో భాగంగా ఈ ఉదయం ట్రంప్, ఆయన భార్య మెలనియా ట్రంప్, కుమార్తె ఇవాంక, అధికారుల బృందం గుజరాత్లో అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేసుకున్నారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా సబర్మతి ఆశ్రమ సందర్శనకు వెళ్లారు.
ఆశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ట్రంప్ దంపతులు. ఆ తర్వాత వారిద్దరు చరఖాతో నూలు వడికారు. వారి వెంట ఉన్న మోడీ, గాంధీ గురించి, రాట్నం ప్రత్యేకత గురించి చెప్పారు. ఈ సందర్భంగా వారికి మోడీ.. మూడు కోతుల మార్బుల్ బొమ్మను బహూకరించారు. ఆశ్రమం నుంచి బయలుదేరే ముందు ట్రంప్ అక్కడి విజిటర్స్ బుక్లో ‘ఈ అద్భుతమైన విజిట్కు గ్రేట్ ఫ్రెండ్ ప్రధాని మోడీకి థ్యాంక్యూ’ అని రాసి సంతకం చేశారు.ఆ తర్వాత అక్కడి నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి వెళ్లారు.