ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును మార్చి 12వ తేదీ మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి హైదరాబాద్కు తరలించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరుచారు. ఈ కేసులో పంజాగుట్ట పీఎస్లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.