పైరసీ కేసులో పట్టుబడి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవిని మరోసారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.ఇప్పటికే రవిని కోర్టు అనుమతితో రెండు సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది రోజులపాటు విచారించారు. ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రవి నుంచి రాబట్టాల్సిన విషయాలు, సేకరించాల్సిన ఆధారాలు ఇంకా ఉన్నాయని మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించడంతో మరో మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.
మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. కోర్టు అనుమతి వచ్చిన క్రమంలో శనివారం (డిసెంబర్ 6) ఉదయం రవిని చంచల్ గూడ జైలు నుండి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.ఈ తీర్పుతో పైరసీ కేసులో పోలీసులుమరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం లభించింది.
►ALSO READ | అనుమండ్ల గుడి లేని ఊరు ఒండొచ్చు.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు: సీఎం రేవంత్
చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కింగ్పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. అనంతరం కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు.
