హైదరాబాద్, వెలుగు: ఏసీబీ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఓ ఫిర్యాదుదారుకు నాంపల్లి కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. దాంతో పాటు రూ.3000 జరిమానా విధిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డి.దుర్గాప్రసాద్ బుధవారం తీర్పు వెల్లడించారు. కాగా,2007లో హుమాయున్ నగర్ ఎస్ఐ మహేశ్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఈ కేసులో ఫిర్యాదుదారు నర్సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఏసీబీ కోర్టులో నిందితునికి అనుకూలంగా నర్సింగ్ తప్పుడు సాక్ష్యం చెప్పాడు.దీంతో ఏసీబీ కోర్టు ఎస్ఐ మహేశ్ ను నిర్దోషిగా పేర్కొంటూ కేసు కొట్టివేసింది. అయితే ఫిర్యాదుదారు నర్సింగ్ తప్పుడు సాక్ష్యం చెప్పినట్లు నిర్ధారణ అవడంతో అతడికి కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది.