పూరి జగన్నాథుని చెంత అక్కినేని దంపతులు.. పెళ్లయ్యాక చై-శోభిత తొలి ఆధ్యాత్మిక యాత్ర!

పూరి జగన్నాథుని చెంత అక్కినేని దంపతులు.. పెళ్లయ్యాక చై-శోభిత తొలి ఆధ్యాత్మిక యాత్ర!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సతీమణి నటి శోభిత ధూళిపాళ్ల ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. వివాహం తర్వాత ఈ జంట మొదటి సారి  ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

శనివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ స్టార్ కపుల్ పూరి జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచైతన్య సంప్రదాయబద్ధంగా తెల్లటి పంచె, చొక్కా ధరించగా.. శోభిత ఎర్రటి చీరలో మెరిసిపోయింది. ఆలయం వెలుపలికి రాగానే చైతూ “జై జగన్నాథ్” అంటూ నినదించడం అక్కడున్న భక్తులను, అభిమానులను ఆకట్టుకుంది.

నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట జగన్నాథుని ఆశీస్సులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగానూ నాగచైతన్య ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హర్రర్, మైథాలజీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా మెప్పించనున్నారు. జయరాం, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మరోవైపు శోభిత కూడా ‘చీకటిలో’ (Cheekatilo) అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.