నారాలోకేష్ రేపటి నుంచి ( నవంబర్ 27) యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన యువనేత లోకేశ్… అన్ని అడ్డంకులను అధిగమించి ఈనెల 27వతేదీ నుంచి గతంలో పాదయాత్ర నిలుపుదల చేసిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడినుంచే ప్రారంభించనున్నారు. నవంబర్ 27 ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించేందుకు టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేశాయి. 11 గంటలకు తాటిపాక సెంటర్ లో బహిరంగ సభ అనంతరం ... అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారని తెలుస్తోంది.