
హైదరాబాద్, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తన 13వ ప్రాపర్టీ షోను హైదరాబాద్లోని హైటెక్స్లో శుక్రవారం ప్రారంభించింది. ఇందులో వంద మందికి పైగా బిల్డర్లు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీలు పాల్గొంటున్నాయి. అన్ని వర్గాల కస్టమర్లకు అనువైన బడ్జెట్లలో విభిన్నమైన ప్రాపర్టీలను అందిస్తున్నామని నరెడ్కో తెలిపింది. ఎమెల్సీ, చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు చీఫ్ గెస్టుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ షో మూడు రోజుల పాటు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ నెల ఎనిమిదో తేదీన ముగుస్తుంది.
పాపులర్ రియల్ ఎస్టేట్ డెవలపర్లను ఒకే పైకప్పు కిందికి ఈ షో తీసుకు వచ్చింది. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములతో కూడిన 300 ప్రాపర్టీల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంకులు హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. కార్యక్రమంలో నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బి. సునీల్ చంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్ విజయసాయి మేక, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, ట్రెజరర్ కాళీ ప్రసాద్ దామెర పాల్గొన్నారు.