జనగామ జిల్లా హాస్పిటల్​ సూపరింటెండెంట్​పై వేటు

జనగామ జిల్లా హాస్పిటల్​ సూపరింటెండెంట్​పై వేటు
  •     ఆర్నెళ్ల పాటు మెడికల్​ కౌన్సిల్​ రిజిస్ట్రేషన్​ బుక్​ నుంచి రిమూవ్​
  •     తప్పుడు మెడికల్​ రిపోర్ట్​ ఇవ్వడమే కారణం

జనగామ, వెలుగు :  జనగామ జిల్లా హాస్పిటల్,  ఎంసీహెచ్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ పగిడిపాటి సుగుణాకర్​ రాజుపై నేషనల్​ మెడికల్​ కౌన్సిల్​​(ఎన్​ఎంసీ) వేటు వేసింది.  ఓ అబార్షన్​ కేసు విషయంలో తప్పుడు మెడికల్​ రిపోర్ట్​ ఇచ్చారనే  కారణంతో యాక్షన్​ తీసుకుంది. ఆర్నెళ్ల పాటు మెడికల్​ కౌన్సిల్​ రిజిస్ట్రేషన్​ బుక్​ నుంచి తొలగించాలని తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ను ఆదేశించింది.  వివరాలిలా ఉన్నాయి.. పాండుగుల దామోదర్​ అనే వ్యక్తి 2011లో  చెన్నై  ఓఎన్​జీసీలో జియోఫిజిస్ట్​గా పనిచేసేవారు.  అప్పట్లో జనగామ డీఎస్పీగా పనిచేస్తున్న  నాగరాజు కూతుర్ని పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే ఉన్నా తర్వాత గొడవలు జరిగాయి.  ప్రెగ్నెంట్​గా  ఉన్న  తనను  తన భర్త దామోదర్​ కాలితో  కడుపుపై  తన్నడంతో అబార్షన్​ అయినట్లు తన తండ్రి నాగరాజు సహాయంతో  2011లో వగరంల్​ మహిళా పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ చేసింది.  దీనికి కాలితో కడుపులో తన్నడంతోనే అబార్షన్​ అయినట్లు డాక్టర్​ సుగుణాకర్​ రాజు ఇచ్చిన మెడికల్​ రిపోర్టు కాపీ జతపరిచారు.  దీంతో దామోదర్​పై వేధింపుల కేసు నమోదు కాగా ఉద్యోగం నుంచి సస్పెన్షన్​ వేటు పడి జైలుకు వెళ్లారు.

ఈ క్రమంలో దామోదర్​కు  డీఎస్పీ కూతురుకు 2014లో కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి.  దీంతో దామోదర్​ తన మానసిక క్షోభకు  డాక్టర్​ సుగుణాకర్​ రాజు ఇచ్చిన తప్పుడు రిపోర్టు  కారణమని ఆయన పై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్​ ఆఫీసర్లను విన్నవిస్తూ వచ్చాడు.   మొదట్లో ఉమ్మడి ఏపీ కౌన్సిల్​లో, 2015లో  తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ లో  కంప్లైంట్​ చేయగా వారు సుగుణాకర్​ రాజుకు  నోటీసులతోనే  సరిపుచ్చారని దామోదర్​ ఆరోపించారు.  తర్వాత ఢిల్లీలోని నేషనల్​ మెడికల్​ కమిషన్​కు 2017లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్​ఎంసీ ఎథిక్స్​ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపింది. రూల్స్​కు విరుద్ధంగా అబార్షన్​ విషయంలో డాక్టర్ సుగుణాకర్​ రాజు మెడికల్​ రిపోర్ట్​ ఇచ్చారని  నిర్ధారణకు వచ్చింది. వైద్య వృత్తిలో అనైతికంగా వ్యవహరించారని తేల్చింది. దీంతో గత నెల 29న డాక్టర్​ సుగుణాకర్​ రాజును ​ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బుక్ నుంచి ఆర్నెళ్ల పాటు రిమూవ్​ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ ,  మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ద్వారా  ఆదేశించింది.  కాగా ఆర్నెళ్ల పాటు ఆయన ఎలాంటి ప్రాక్టీస్​ చేయరాదని రూల్స్​ చెప్తున్నాయి.  ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాధితుడు దామోదర్​ ‘వెలుగు’తో మాట్లాడుతూ.. తన పై డాక్టర్​ సుగుణాకర్​ రాజు తప్పుడు  రిపోర్ట్​ ఇచ్చినట్లుగా రుజువు అయ్యిందన్నారు. 12 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.

నేను ఏ తప్పూ చేయలేదు 

నేను ఏ తప్పుడు రిపోర్ట్​లు ఇవ్వలేదు. 2014లోనే దామోదర్​ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరు మరో పెండ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నారు.  డాక్టర్ గా తాను చేసిన పనిపై నేషనల్ మెడికల్​ కమిషన్​కు దామోదర్​ తప్పుడు సమాచారం ఇచ్చారు. కమిషన్​ ఇచ్చిన ఆర్డర్స్ పై అప్పిలేట్​కు వెళ్లేందుకు 60 రోజుల గడువుంది. అప్పిలేట్​ కు వెళ్తా. నా పై కొందరు చేస్తున్న కుట్రల నుంచి బయటపడతా.
- డాక్టర్ సుగుణాకర్​ రాజు, జిల్లా హాస్పిటల్​ సూపరెంటెండెంట్,​ జనగామ