తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు తెలియజేశాడు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ ‘తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ‘నవతిహి’ పేరుతో జులైలో మలేషియాలో గ్రాండ్ ఈవెంట్ను చేయాలనుకున్నాం.
ఇండస్ట్రీలోని పెద్దలందరితో చర్చించి డేట్ అనౌన్స్ చేస్తాం. అందరిని ఈవెంట్కి వచ్చేలా చేస్తాం. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాం. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాం. ఈ ఈవెంట్ కోసం మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి సెలవులు ఇవ్వాలని ఫిల్మ్ చాంబర్ను కోరాం.
దిల్ రాజు గారు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, మలేషియా అడ్వైజర్ కమలనాథన్, మలేషియా టూరిజం డైరెక్టర్ రాజౌది అబ్దుల్ రాహిల్ పాల్గొన్నారు.